Most Wanted Criminal: మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, బెదిరింపుల కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు అనిల్కుమార్ రెడ్డి. సీబీఐ అతడ్ని పట్టుకుని ఏపీ పోలీసులకు అప్పగించింది. దీంతో అనిల్పై ఉన్న కేసుల దర్యాప్తు వేగంగా జరగనున్నాయి. ఎవరీ అనిల్కుమార్ రెడ్డి? ఎందుకు విదేశాలకు పారిపోయాడు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనిల్కుమార్రెడ్డి చిక్కాడు
తప్పు చేసిన నిందితులు విదేశాలకు పారిపోయినా ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవు. కొంచెం ఆలస్యమైనా వారిని అరెస్టు చేస్తుంది. ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిన అనిల్ కుమార్ రెడ్డి విషయంలో అదే జరిగింది. విదేశాల్లో వాడ్ని పట్టుకుని అరెస్టు చేసింది సీబీఐ. చివరకు ఏపీ పోలీసులకు అప్పగించింది.
ఏపీలో ఎద్దుల అనిల్కుమార్ రెడ్డిపై రకరకాల కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, బెదిరింపుల కేసులో కీలక నిందితుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పత్తా లేకుండా విదేశాలకు చెక్కేశాడు. అక్కడి నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చాడు. దీనిపై ఏపీ పోలీసులు.. సీబీఐని సంప్రదించారు.
దుబాయ్లో అరెస్టు.. ఏపీ పోలీసులకు అప్పగించిన సీబీఐ
రంగంలోకి దిగిన సీబీఐ, ఇంటర్ పోల్ సహాయంతో యుఏఈ అధికారులు రెడ్ నోటీసు జారీ చేశారు. ఈ విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబిఐ తనవంతు సహకారం అందించింది. అనిల్ కుమార్ని దుబాయ్ లో అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. అంతర్జాతీయ పోలీసు సహకార విభాగం, మరోవైపు సీబీఐ, ఇంకోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ, అబుదాబి ప్రభుత్వంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
దుబాయ్ పోలీసుల బృందం ఎస్కార్ట్గా అనిల్కుమార్ రెడ్డిని దుబాయ్ నుండి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకి తరలించారు. విమానాశ్రయంలో ఏపీ పోలీసులకు అతడ్ని అప్పగించారు. ప్రాథమిక విచారణ కోసం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అనిల్ అరెస్టుతో ఏపీలోని పెండింగ్ కేసుల్లో కీలక పురోగతి లభించనుంది.
ALSO READ: వైసీపీ బెదిరింపు రాజకీయాలు.. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికిస్తారు?