ఏపీ సీఎం చంద్రబాబు నాయడు తెలుగు ప్రజలను మరోసారి ఐక్యం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. దశాబ్దాల కిందట భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలను ఏకం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పొట్టిశ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన చేసిన త్యాగం అంత సులువుగా మరువలేనిదని పేర్కొన్నారు. అందుకనే ఏపీ రాజధానిలో ఆయన త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారుచేయించి సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రారంభించారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి మెలిసి ఉన్న తెలుగు ప్రజలు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. అంతకుముందు సైతం ఇలాగే ఏపీ,తెలంగాణ విడిపోయి ఉన్న రాష్ట్రాలు ఒక్కటిగా కలువడంలో పొట్టి శ్రీరాములు పాత్ర మరువలేనిది. ఆయన ఆమరణ నిరాహార దీక్షకారణంగానే తెలుగు మాట్లాడే ప్రజలు ఒకే గొడుకు కిందకు అనగా ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డారు. అయితే, ఉమ్మడి ఏపీ ఏర్పడక ముందే పొట్టి శ్రీరాములు మరణించగా.. అనంతరం జరిగిన ఉద్యమాల కారణంగా కేంద్రం తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చింది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధుల విషయంలో తేడాలు వచ్చి తిరిగి 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన విషయం తెలిసిందే.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడే వారంతా కలిసి మెలిసి అన్మదమ్ముల వలే ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉంటేనే బలం అని.. అప్పుడు కేంద్రం వద్ద రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవలి కాలంలో ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారు. నదీ జలాల వివాదాలపై అటు గోదావరి, ఇటు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు నడుస్తున్నాయి.ఏదైనా తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల సరిహద్దుల విషయంలోనూ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల ఇటీవల కీలక ప్రతిపాదన చేశారు. భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారు. అందుకు చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయంలో ఏడు మండలాలను కేంద్రం ఏపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పోలవరం ముంపు కిందవెళ్తున్నాయి.అందుకే వాటిని ఏపీలో విలీనం చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. తెలుగు ప్రజలు ఐక్యత కోసం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ప్రజల మధ్య ఐక్యత వర్థిల్లుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.