Chandrababu Naidu: సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, సైబర్ నేరగాళ్లు దాన్ని అంతకంటే వేగంగా వాడుకుంటూ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. సామాన్యులనే కాదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లను వాడుతూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఒక హైటెక్ సైబర్ మోసం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డీప్ఫేక్ (Deepfake) వీడియోను ఉపయోగించి ఓ వ్యక్తి నుంచి రూ. 80 వేలు కాజేశారు.
మాజీ మంత్రి ఫోటో.. సీఎం పేరుతో కాల్
విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకుని పరిచయం చేసుకున్నాడు. బాధితుడికి ఉన్న ఒక భూమి లేదా ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మించాడు. అంతేకాదు, నమ్మకం కుదిరించేందుకు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుల పేర్లను వాడుకున్నారు.
డీప్ఫేక్ మాయాజాలం
మరో అడుగు ముందుకేసి, తాము నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడిస్తామంటూ ఒక వీడియో కాల్ చేశారు. అవతలి వైపు సీఎం చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియో కాల్ను డిజైన్ చేశారు. జీవీఎంసీ (GVMC) కమిషనర్పై ఉన్న లంచం ఆరోపణలను నిరూపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, సమస్యను వెంటనే క్లియర్ చేస్తామని ఆ వీడియో కాల్ ద్వారా నమ్మించారు. ఆ మాటలు నిజమేనని నమ్మిన శ్రీనివాసరెడ్డి, వారు అడిగినట్లుగా రూ. 80 వేలను సైబర్ దొంగల ఖాతాలోకి బదిలీ చేశాడు.
మోసం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు
డబ్బులు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు శ్రీనివాసరెడ్డికి అనుమానం వచ్చింది. తాను మాట్లాడింది అసలు చంద్రబాబుతో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిన డీప్ఫేక్ వీడియో కాల్ అని ఆలస్యంగా గ్రహించి లబోదిబోమన్నాడు. మోసపోయానని తెలిసిన వెంటనే ఆయన విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు దుర్మరణం!