New Diesel Regulations: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. దేశంలో డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే డీజిల్ అమ్మకాలపై పరిమితులు విధిస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డీజిల్ వినియోగించే సంస్థలు ఇకపై సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయకుండా ప్రత్యేక అమలు చేస్తోంది.
గత కొంతకాలంగా డీజిల్ ధరల్లో రిటైల్ విక్రయాలు, బల్క్ విక్రయాల మధ్య భారీ తేడా ఏర్పడింది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.95.20గా ఉండగా, బల్క్ వినియోగదారులకు సరఫరా చేసే డీజిల్ ధర రూ.134.50 వరకు ఉంది. అయితే, తక్కువ ధరల కారణంగా పలు సంస్థలు తమ వాహనాలకు నేరుగా పెట్రోల్ బంకులకు వెళ్లి పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రావెల్స్, నిర్మాణ రంగ కంపెనీలు, పరిశ్రమలు తక్కువ ధరలో డీజిల్ పొందేందుకు రిటైల్ బంకులను ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో సాధారణ వాహనదారులకు డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా చమురు మార్కెటింగ్ సంస్థలకు కూడా ఆర్థిక భారం పెరుగుతోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త నియంత్రణలను అమలు చేయాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వాహనం లేదంటే ఒక వినియోగదారుకు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే అమ్ముతారు. అంతకంటే ఎక్కువ పరిమాణంలో డీజిల్ను రిటైల్ బంకుల ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. డీజిల్ ను నేరుగా వాహన ట్యాంకులోనే నింపాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ కంటెయినర్లలో తీసుకెళ్లాల్సి వస్తే, పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) ఆమోదించిన క్యాన్లను మాత్రమే ఉపయోగించాలి. సాధారణ ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర అనుమతి లేని బాటిళ్లలో డీజిల్ నింపకూడదని వెల్లడించింది.
మరోవైపు బంకుల నుంచి కొనుగోలు చేసిన డీజిల్ను ఇతరులకు తిరిగి విక్రయించడాన్ని కూడా కేంద్రం నిషేధించింది. నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయించడం, అనధికారికంగా ఇతరులకు సరఫరా చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత అవసరాల కోసం భారీగా ఇంధనం వినియోగించే సంస్థలు ఇకపై తమ సొంత బంకుల నుంచి లేదంటే అధికారిక బల్క్ సరఫరా వ్యవస్థల ద్వారానే డీజిల్ కొనుగోలు చేయాలి. సాధారణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిటైల్ బంకులను ఈ అవసరాల కోసం ఉపయోగించకూడదు. ప్రస్తుతం ఈ నిబంధనలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం వాటి గడువును మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: సముద్రం అడుగున అనంత సంపద.. ఈవీల భవిష్యత్తు అక్కడేనా?!