Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మన్యంలో క్షణక్షణానికీ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఉపరితల వర్షాలకు తోడు ఎగువ నుంచి భారీగా తరలివస్తున్న వరద నీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చీమలపాడు-వీరాపురం ఇసుకర్యాంపు వద్ద ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఇసుకర్యాంపులో క్షణక్షణం భయం భయం!
వరద ప్రవాహం ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో ఇసుకర్యాంపులో ఉన్న 38 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు నది మధ్యలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి, బాధితులకు లైఫ్ జాకెట్లు అందించి రెస్క్యూ బృందాల సాయంతో అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇసుక లోడుతో ఉన్న లారీలను కూడా క్షేమంగా బయటకు తీయడంతో అధికారులు, డ్రైవర్లు ఊపిరి పీల్చుకున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహజ్వాలలు
ఓవైపు గోదావరికి వరద హెచ్చరికలు జారీ చేసినా.. ఇసుక తవ్వకాలు కొనసాగించడంపై స్థానికులు, డ్రైవర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల లాభాపేక్షే ఈ ప్రమాదానికి కారణమని మండిపడుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ముంపు ముంగిట్లో లోతట్టు ప్రాంతాలు
మరోవైపు కాలేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 12.610 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ వద్ద దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్లు నీట మునిగాయి. రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి ప్రవాహం దూసుకొస్తోంది. వాజేడు, ఏటూరునాగారం మండలాల లోతట్టు ప్రాంతాలను బ్యాక్ వాటర్ ముంచెత్తుతుండటంతో, అధికారుల రెస్క్యూ బృందాలు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి.
Also Read: ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పూర్తి వివరాలు వెల్లడించిన సీఈవో