CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లాను దేశంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతామని, దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనిక జిల్లాగా ఎదిగిన రంగారెడ్డి జిల్లా తరహాలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన ప్రకటించారు. రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల విద్యుత్ రంగం కుప్పకూలిందని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019-24 మధ్య కాలంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, పీపీఏల (PPA) రద్దు వల్ల విద్యుత్ వినియోగం లేకపోయినా దాదాపు రూ. 9,000 కోట్ల ప్రజాధనాన్ని వృథాగా చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలపై రూ. 1.12 లక్షల కోట్ల భారం మోపడమే కాకుండా, తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 32,000 కోట్ల అదనపు భారం వేశారని మండిపడ్డారు. విద్యుత్ రంగ సంస్కరణలకు తాను 2000వ సంవత్సరంలోనే పునాది వేశానని, అయితే గత ఐదేళ్లలో అవినీతి, వేధింపుల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచి పారిపోయారని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి చిరునామాగా మారబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకుంటే, ఏపీ ఒక్కటే 160 గిగావాట్ల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎన్టీపీసీ రూ. 1.85 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేవలం 22 నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం 117 ప్రాజెక్టులను క్లియర్ చేసిందని, దీని ద్వారా 4.76 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రవాణా రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వీటి కోసం వెయ్యికి పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 5,000 కు పెంచుతామని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం మన యువత హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ ఉన్న వారిని కూడా ఏపీకి రప్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్త పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఆంధ్రప్రదేశ్కే రావడం తమ పాలనకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
CM Chandrababu Naidu, Anakapalli visit highlights, Clean energy plant Rambilli inauguration, AP green energy target 160GW, electric buses in Andhra Pradesh RTC.