CM Chandrababu :
⦿ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి భారీ పెట్టుబడులు
⦿ త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభం
⦿ అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి..
⦿ హైడ్రోజన్ను వాడితే తగ్గనున్న వేడి
⦿ చిట్చాట్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
విజయవాడ, స్వేచ్ఛ: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని తెలిపారు. కాగా, ఈ గ్రీన్కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ను టేకోవర్ చేయనుందని, ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు.
ఈ ప్లాంట్పై రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని, రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోందన్నారు. ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని సీఎం స్పష్టం చేశారు. బయోగ్యాస్కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందని, ఆ గడ్డి పెంచడానికి ఎకరాకు రూ.30 వేలు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనున్నట్లు సీఎం వెల్లడించారు. మరోవైపు బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ను కుప్పానికి తెచ్చిందని, సూర్యఘర్ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్కు డబ్బు చెల్లిస్తారని తెలిపారు. దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
భువనేశ్వరే కారణం..
ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిలో సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆయన ఆకాంక్షించారు. పండగ సమయంలో ఊరెళ్లి ప్రజలందరితో సంతోషంగా గడపాలని, అందుకే తాను ప్రతి సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్తున్నట్లు వెల్లడించారు. సొంతూరు వెళ్లే సంప్రదాయానికి నారా భువనేశ్వరే కారణమన్నారు. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు (నవ్వుతూ) ఆయన తెలిపారు. పండగ సమయంలో ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని, మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమన్నారు. ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని, వారికి చేయూతనివ్వడానికి, ప్రోత్సహించడానికి పీ4 కాన్సెప్ట్ పేపర్ను ఆదివారం విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు మీడియాకు వివరించారు.
రవాణాశాఖకు కీలక ఆదేశాలు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వస్తున్న లక్షలాదిమంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also read : మొదలుకానున్న రేషన్ కార్డుల జాతర.. క్యూఆర్ కోడ్ లతో నూతన కార్డుల జారీకి తేదీ నిర్ణయించిన ప్రభుత్వం..