Delhi AI Summit-2026: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ భవిష్యత్తు ఇదేనని బలంగా చెబుతోంది ఇండియా. ఇండియా కాన్ఫిడెన్స్ చూసి టెక్ దిగ్గజాలు ఆశ్చర్య పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చూసి వారిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఇవాళ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరవుతున్నారు.
ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్రెడ్డి హాజరు
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026కు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఇరువురు సీఎంలు ఈ సమిట్పై ఫోకస్ చేశారు. ప్రస్తుతం జైపూర్లో ఓ వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు, అక్కడి నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్తారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
ఏపీ, తెలంగాణను టెక్నాలజీకి హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అంతేకాదు అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. శుక్రవారం ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ అనే అంశంపై అస్సాం సీఎం బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ప్రసాద, సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ.. ఒప్పందాలపై సంతకాలు!
ఆ తర్వాత ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 10 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎం, క్వాంటమ్-ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకునే అవకాశముంది. క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ-మద్రాస్తో మరో ఒప్పందం చేసుకోనుంది.దీనికితోడు ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన వచ్చే అవకాశముంది. క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఏఐ ద్వారా పోటీతత్వం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సీఈఓ బోర్జ్ బ్రెండే, సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
ALSO READ: మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే.. జగన్ సంచలన వ్యాఖ్యలు!
యూకే నుంచి వచ్చిన ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అందులో బ్రిటన్ ఏఐ, ఆన్లైన్ సేఫ్టీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. భారత్లో యూకే హై కమిషనర్ లిండికెమరాన్లతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరామ్కో ఇండియా ఎండీ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటో డెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలేలతో వేరువేరుగా సమావేశం కానున్నారు సీఎ చంద్రబాబు.