CM Chandrababu Naidu: తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఎన్డీయే (NDA) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ద్వారా మహిళలకు గొప్ప మేలు జరుగుతుందని, 50% సీట్ల పెంపుతో రాష్ట్రాలకు సమన్యాయం లభించేదని ఆయన పేర్కొన్నారు. అయితే, 2026-27 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేయాలనే విపక్షాల అనాలోచిత డిమాండ్ల వల్ల, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజల భాషలు వేరైనా, అందరూ ద్రవిడ జాతీయులుగా ఐక్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల సమైక్యతను చాటిచెప్పేందుకే కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నటుడిగా, మహానేతగా ఎదిగింది ఈ తమిళ గడ్డ మీద నుంచేనని, ఎన్టీఆర్, ఎంజీఆర్ మధ్య ఉన్న గొప్ప స్నేహ బంధాన్ని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అన్నా డీఎంకే అంటే మనకందరికీ జయలలిత గారే గుర్తొస్తారని, ఆమె బతికున్నప్పుడు ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను చంద్రబాబు పంచుకున్నారు.
రాజకీయ విమర్శల విషయంలో చంద్రబాబు కాంగ్రెస్, డీఎంకే కూటమిపై నిప్పులు చెరిగారు. 1967లోనే కాంగ్రెస్ అహంకారాన్ని అణిచివేసిన చరిత్ర తమిళనాడుదని, కానీ నేడు అన్నాదురై ఆశయాలకు విరుద్ధంగా స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అదే కాంగ్రెస్తో జతకట్టడాన్ని ఆయన విమర్శించారు. శ్రీలంకలో తమిళులు ఎదుర్కొన్న కష్టాలకు ఈ రెండు పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. తమిళుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు అభివృద్ధిని కోరుకునే ఎన్డీయే కూటమిని ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఏడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: ప్రధాని పర్యటనకు ముందే షాక్.. రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ఎగసిపడ్డ మంటలు!