Rajasthan refinery fire accident: రాజస్థాన్లోని బాడ్మేర్లో నిర్మాణంలో ఉన్న హెచ్పీసీఎల్ (HPCL) రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పెట్రో కెమికల్ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ప్లాంట్లోని ఒక విభాగం నుండి మంటలు భారీగా ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఈ పెట్రో కెమికల్ ప్లాంట్ను రేపు (మంగళవారం) ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు ఈ అగ్నిప్రమాదం జరగడం భద్రతా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే రిఫైనరీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ అగ్నిప్రమాదం వల్ల ప్రారంభోత్సవ షెడ్యూల్లో ఏవైనా మార్పులు ఉంటాయా లేదా అనే అంశంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. భద్రతా సిబ్బంది, ప్లాంట్ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
Read Also: తెలిసిన వ్యక్తిలా ఫోన్ కాల్స్.. AI వాయిస్ క్లోనింగ్ స్కామ్.. నమ్మితే ఖాతా ఖాళీ!