Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం.. ‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASCI) పథకాల ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, గోదావరి జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రాబోయే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
దేశ తూర్పు ప్రాంత రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం తెచ్చిన ‘పూర్వోదయ’ పథకం వికసిత్ భారత్ లక్ష్యసాధనలో కీలకమని, దీని ద్వారా ఏపీని జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీటి వ్యవస్థల ఆధునీకరణ, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు ఈ పథకం నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. అలాగే, ‘సాస్కీ’ పథకం కింద విశాఖలో యూనిటీ మాల్, హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణం, గండికోట పర్యాటక ప్రాజెక్టు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాస్కీ కింద రూ.10,054 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాలను కరువు నుంచి గట్టెక్కించి ‘హార్టికల్చర్ హబ్’గా మార్చేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కోరారు. ఇక్కడ ప్రపంచ స్థాయి డిమాండ్ ఉన్న 18 రకాల పంటలు సాగవుతున్నాయని, 93 క్లస్టర్ల ద్వారా 33.7 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల సాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇందుకోసం లాజిస్టిక్స్, నీటి వనరుల కల్పన కోసం వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనివల్ల రైతుల ఆదాయం రూ.3.5 లక్షలకు పెరుగుతుందని వివరించారు.
రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను (200 టీఎంసీలు) మళ్లించే ‘పోలవరం-నల్లమల సాగర్’ లింక్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించినట్లే, ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ‘జలహారతి కార్పొరేషన్’ ఏర్పాటు చేశామని, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్ సమర్పిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని వెల్లడించారు.