Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి భద్రత, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. ఆయన కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘జల్ జీవన్ మిషన్’ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. అలాగే, ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.524.41 కోట్ల వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు. ‘ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన (PMKSY – RRR)’ కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు కేంద్రం నిధులు ఇస్తే గ్రామీణ సాగునీటి సామర్థ్యం పెరుగుతుందని పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
జాతీయ ప్రాజెక్టయిన పోలవరం పనుల పురోగతిని వివరించిన చంద్రబాబు, పెండింగ్ అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. రెండో దశ పనుల నిధుల కోసం త్వరలో నివేదిక ఇస్తామన్నారు. మరోవైపు, వంశధార ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తూ శ్రీకాకుళం జిల్లా కరువు ప్రాంతాలకు వరప్రదాయిని అయిన ‘నేరడి బ్యారేజ్’ నిర్మాణానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ వంటి చర్యలకు పాల్పడకుండా కేంద్రం నిలువరించాలని సీఆర్ పాటిల్ను కోరారు.
Read Also: Jagan Plan: బీజేపీని ఢీ కొట్టిన జగన్.. అస్త్రాలు ప్రయోగం, కంగుతిన్న వైసీపీ సీనియర్లు