Amaravati: వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అజాత శత్రువుగా ఆయన పేరు పొందారని అన్నారు. అటల్లో ఏదో తెలియని తేజస్సు ఉందని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలను నెహ్రూ ఆసక్తిగా వినేవారని అన్నారు.
అమరావతిలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్సింగ్. డిసెంబర్ 25న మాజీ మంత్రిఅటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు. ఆయన జయంతిని పురస్కరించుకుని వెంకటపాలెంలో 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే మొక్కలు నాటారు.
ఆ తర్వాత వేదిక వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి ప్రస్తానంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని తిలకించారు నేతలు. అలాగే చేనేత స్టాల్స్ని పరిశీలించారు. మంగళగిరి వస్త్రాల ప్రత్యేకతను నేతలకు వివరించారు చేనేతలు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన, వాజ్పేయి ఏనాటికైనా ప్రధాని అవుతారని ఆనాడే నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు.
స్మృతివనం ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు
1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ప్రధాని ఇందిరాగాంధీకి వాజ్పేయి మద్దతు ఇచ్చారని అన్నారు. ఆయన మాటలు తనకు ఎప్పటికీ ప్రేరణ ఇస్తాయన్నారు. రాహుల్ గాంధీ మాత్రం.. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
అద్భుతమైన విదేశాం విధానానికి అటల్ రూపకల్పన చేశారని, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేందుకు ఆనాటి ప్రధాని పీవీ.. వాజ్పేయిని ఎంపిక చేసిన విషయాన్ని వివరించారు. విలువల కోసం ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవిని ఆయన వదులుకున్నారని అన్నారు.
ALSO READ: ఎట్టకేలకు ఏపీలో తొలి అడుగు.. డ్రోన్ల ద్వారా ట్రైబల్ ప్రాంతాల్లో వైద్య సేవలు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం గర్వించదగిన నాయకుడు, అరుదైన నేత వాజ్పేయి అని అన్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఘన కీర్తి అందరికీ తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఆయన విగ్రహాలు 26 జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు.
ఆయన ఎన్టీఆర్కు ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఆయన హయాంలో దేశంలో మెరుగైన జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్ పేయి తీవ్రంగా కృషి చేశారన్నారు. ఆయన హయాంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు.