CM Chandrababu Naidu: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ (LPG) నిల్వలు.. బుకింగ్.. సరఫరా వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా BPCL, HPCL, IOCL సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా నిరంతరం సాగుతోందని వెల్లడించారు.
ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ విషయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై సీఎం అడిగిన ప్రశ్నకు.. ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు బదులిచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సిలిండర్ సరఫరా సమయాన్ని యథాస్థితికి (నార్మల్సీ) తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇకపై ప్రతి రోజూ ఎల్పీజీ నిల్వలు.. బుకింగ్.. సరఫరా ప్రక్రియపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆస్పత్రులు.. స్కూళ్లు.. దేవాలయాల్లో రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
వచ్చే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాలకు మరిన్ని ఎల్పీజీ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం జరపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా గ్యాస్ పైప్లైన్.. ఇండక్షన్ స్టవ్స్ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా.. రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు నిత్యావసర ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని సీఎం స్పష్టం చేశారు.
Read Also: Bangkok Pilla: వామ్మో.. బ్యాంక్ పిల్ల ఇంట్లో పేలిన ఇండక్షన్ స్టవ్.. అక్కడ గ్యాస్ వాడరా?