Amaravati: అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్గా మార్చే మరో అడుగు ముందుకు పడిందన్నారు సీఎం చంద్రబాబు. సురక్షిత కమ్యూనికేషన్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరమని తేల్చిచెప్పారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్- ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్గా మార్చే మరో అడుగు-సీఎం చంద్రబాబు
ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం తర్వాత ప్రపంచ స్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో అడుగు పడిందన్నారు. దేశీయ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. అది ప్రపంచ స్థాయి క్వాంటం పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా మరో ముఖ్యమైన అడుగు వేస్తోందన్నారు.
దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ వల్ల కమ్యూనికేషన్స్-సైబర్స్పేస్ భద్రత రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు చేపట్టనున్నారని వివరించారు.
డీప్ టెక్ ఆవిష్కరణలకు హబ్ మారుతుంది-సీఎం
టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫొటోనిక్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్పై పరిశోధనలకు మద్దతు ఇస్తుందన్నారు. ఆధునిక టెక్నాలజీ, డీప్టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్త అవకాశాలు రానున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్కు సహకరిస్తున్న సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు.
ALSO READ: ఎన్నికల హామీలు ఏమయ్యాయి? నారా లోకేష్పై చీటింగ్ కేసు పెట్టాలి.. వెల్లంపల్లి డిమాండ్