Amaravati: ఏపీలో కొందరు నేతల తీరు ఏ మాత్రం మారలేదా? పదే పదే సీఎం చంద్రబాబు చెబుతున్నా, ఏ మాత్రం పట్టించుకోలేదా? ఈ విషయంలో ఇప్పటికే చాలామంది నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అయినా నేతల తీరు మారలేదు. టోల్గేట్ సిబ్బందిపై ఓ ఎమ్మెల్యే అనుచరుల దాడిపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అసలేం జరిగింది?
మారని నేతల అనుచరులు.. సీఎం చంద్రబాబు సీరియస్
శనివారం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా ఘటన కొత్త మలుపు తిరుగుతోంది. టోల్ ప్లాజా సిబ్బందిపై గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం చివరకు సీఎం చంద్రబాబు చెవిలో పడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద శనివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వాహనాన్ని టోల్ గేట్ వద్ద ఆపారు. దీంతో ఆయన అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దాడి చేసినట్టు ఆరోపణలు తీవ్రమయ్యాయి. తాము అధికారంలో ఉండగా ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతారా? అనుచరులు నిలదీశారు.
టోల్ ప్లాజా ఘటన.. కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశం
అంతేకాదు శ్రీలత అనే ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మేనేజర్ రవిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని బాధితులు ఆరోపించినట్టు వార్తలు హంగామా చేశాయి. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై ఎలాంటి దాడి జరగలేదని టోల్ ప్లాజా మేనేజర్ రవి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని వాల్మీకిపురం పోలీసులు తెలిపారు. ఈ వివాదంపై గందరగోళం కొనసాగుతున్న వేళ, సదరు ఎమ్మెల్యే అనుచరులు టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై దౌర్జన్యం చేసిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మీడియాలో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే సురేంద్రబాబు రియాక్ట్ అయ్యారు.
ALSO READ: ఏపీలో స్పేస్ సిటీకి వేగంగా అడుగులు, మంత్రి లోకేష్ ప్రకటన, ముందుకొచ్చిన ఆస్ట్రోబేస్
టోల్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా మా వాహనాన్ని నిలిపి వేశారని తెలిపారు. తమ సిబ్బంది ప్రతిఘటించారని, ఎలాంటి దాడి చేయలేదన్నారు. మేనేజర్ను కిడ్నాప్ చేయలేదని అతని ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు వాయల్పాడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు తెలిపారు.
సోషల్ మీడియాలో దృశ్యాలు ఒకలా, ఘటనపై వార్తలు మరొకలా రావడంతో దానిపై ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. ఇదేకాదు.. గతంలో ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు పలు విషయాల్లో దురుసుగా వ్యవహరించడం, ఆ విషయం టీడీపీ హైకమాండ్ దృష్టికి రావడంతో పలుమార్లు మందలించారు సీఎం.