CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో, అంతర్గత విభేదాలు, రెబల్స్ సమస్యలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ నాయకత్వం, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కీలక సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో భాగంగా సీఎం రేవంత్రెడ్డితో పార్టీ ఇంచార్జ్ మీనాక్షి జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులు, స్థానిక నేతల తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్రపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సమావేశంలో పార్టీ అంతర్గత నివేదికలను పరిశీలించిన సీఎం, 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో రెబల్స్ను నియంత్రించడంలో, పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంలో ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని స్పష్టం చేశారు. ముఖ్యంగా రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, లోకల్ గ్రూప్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కాంగ్రెస్కు నష్టం వాటిల్లిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని హెచ్చరించారు. ఇది సాధారణ ఎన్నిక కాదు. పార్టీ భవిష్యత్తుకు పునాది వేసే ఎన్నిక అని స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రత్యేకంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో పార్టీకి బలమైన అవకాశం ఉన్నప్పటికీ, అంతర్గత గొడవల వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామాల్లో ఓడిపోతే.. ప్రజల్లో ఏ సందేశం వెళ్తుంది? అని ప్రశ్నించారు.
పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరించిన వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కేవలం స్థానిక స్థాయిలోనే కాకుండా, రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయని నేతలకు గుర్తుచేశారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు రిపీట్ కావొద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి బలపడాలంటే క్రమశిక్షణ, సమన్వయం తప్పనిసరని ఆమె సూచించారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.
Also Read: కాళేశ్వరం కూలడానికి కారణం ఆ సంస్థే.. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు..
ఈ సమీక్ష అనంతరం పీసీసీ నాయకత్వం కూడా జిల్లా, మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రెబల్స్ సమస్యను వెంటనే పరిష్కరించి, పార్టీ అధికారిక అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు అందేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా నివేదికలు సిద్ధం చేసి, అధిష్టానానికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.