Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. బ్యారేజీ దెబ్బతినడానికి ప్రధానంగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టం చేసింది. సొంత నిధులతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తీసుకోకపోతే, సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై న్యాయశాఖ సలహా కోరగా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర బ్యారేజీల పరిస్థితిపై.. విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కూడా ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా సిఫారసు చేసింది. బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా నిర్మాణ సంస్థ నుంచే రాబట్టాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కూడా వ్యక్తం చేయడం ప్రభుత్వ నిర్ణయానికి బలం చేకూర్చింది.
సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులను స్పష్టంగా ఆదేశించారు. బ్యారేజీల మరమ్మతుల ఖర్చు రూపాయి కూడా ప్రభుత్వంపై పడకూడదు. నిర్మాణ సంస్థలే భరించాలి, వాటి ద్వారానే మరమ్మతులు జరగాలి అని తేల్చిచెప్పారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి, అన్నారం బ్యారేజీ నిర్మించిన అఫ్కాన్స్కు, సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన నవయుగ సంస్థకు నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ నోటీసులకు వచ్చిన సమాధానాలు ప్రభుత్వాన్ని సంతృప్తిపరచలేదని సమాచారం. బాధ్యత తీసుకునే విషయంలో స్పష్టత లేకపోవడం, మరమ్మతులపై నిర్లక్ష్య వైఖరి కనబరచడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. వాటికి వచ్చే స్పందన ఆధారంగా క్రిమినల్ కేసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మేడిగడ్డ బ్యారేజీని 2019 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్లో వరదలు వచ్చిన అనంతరం గేట్లు మూసినప్పుడు, బ్యారేజీ దిగువ భాగంలో ఉన్న రక్షణ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం 2020 ఫిబ్రవరి, 2020 మే నెలల్లో కూడా రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ లోపాలపై ప్రభుత్వ అధికారులు ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అవసరమైన మరమ్మతులు చేపట్టలేదని ప్రభుత్వం గుర్తించింది.
ఒప్పంద నిబంధనల ప్రకారం, బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి.. రెండేళ్లలోపు ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేయాల్సిన బాధ్యత పూర్తిగా నిర్మాణ సంస్థదే. అయితే 2019, 2020లలోనే లోపాలు బయటపడినా, ఎల్ అండ్ టీ వాటిని పట్టించుకోలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఉద్దేశపూర్వక ఒప్పంద ఉల్లంఘనగా అధికారులు నిర్ధారించారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే యూరియా బుకింగ్
ఇంకా కీలక అంశం ఏమిటంటే, 2023 అక్టోబర్ 21న ఏడో బ్లాక్ కుంగిన ఘటన తర్వాత.. మరుసటి రోజు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో, ఎల్ అండ్ టీ ప్రతినిధి సురేష్ కుమార్ బ్యారేజీ మరమ్మతుల వ్యయాన్ని సంస్థే భరిస్తుందని స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ, ఆ హామీని అమలు చేయడంలో జాప్యం జరగడం ప్రభుత్వాన్ని తీవ్రంగా అసంతృప్తికి గురి చేసింది.