Cognizant Vizag: విశాఖపట్నం కేవలం దేశంలోని ఇతర నగరాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీ పడుతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. గురువారం విశాఖ మధురవాడలో ఐటీ దిగ్గజం ‘కాగ్నిజెంట్’ శాశ్వత క్యాంపస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ రాక విశాఖ ఐటీ చరిత్రలో, ఏపీ ప్రగతిలో ఒక చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు.
సుమారు రూ.1500 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపస్ ద్వారా ప్రాథమికంగా 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య 20 వేలకు చేరుతుందని లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వెనుక ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తూ.. “దావోస్లో నా పుట్టినరోజు నాడు కాగ్నిజెంట్ ప్రతినిధులతో చర్చలు జరిపాను. పరిశ్రమలు వస్తే ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తామని సీఎం అనుమతితో ఆఫర్ ఇచ్చాను. ఆ చొరవ ఫలితమే నేటి ఈ శంకుస్థాపన” అని వివరించారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతపై పనిచేస్తుందని తెలిపారు.
తమ ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను అమలు చేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా, రెడ్ టేపిజాన్ని తొలగించి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు విశాఖను కూడా అదే స్థాయిలో ఎకనామిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ ఉద్యోగులు విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, రాబోయే రోజుల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: AP Politics: విజయసాయిరెడ్డి.. పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా?