Flash Floods: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను దక్షిణ భారతదేశం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి తుపాను కారైకాల్ కి 150 కి,మీ., పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 10 కి.మీ వేగంతో తుపాను కదిలిందని పేర్కొంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు తుపాను చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తుపాను ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: Dithwa Cyclone: భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, NDRF, SDRF బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలర్ట్గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101లో సంప్రదించాలని కోరారు.