Ditwa Cyclone Effect: నెల్లూరు జిల్లాపై ‘దిత్వా’ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..
ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ముఖ్యమైన పంబలేరు, ఉప్పుటూరు, పల్లవోలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. నదులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో ఉన్న అలుగులు పొంగి, చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, కాలనీలు నీట మునగడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ వర్షానికి యువకుడి మృతి..
ఈ భారీ వర్షాల కారణంగా ఒక దారుణ సంఘటన కూడా చోటుచేసుకుంది. పొట్టేపాళెం కలుజులో పడి ఒక యువకుడు మృతి చెందాడు. నీటి ప్రవాహం ఉధృతిని అంచనా వేయలేకపోవడంతో వాగు దాటే ప్రయత్నం చేశాడు.. దీంతో వాగులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు..
వ్యవసాయం వర్షాల ఎఫెక్ట్..
వ్యవసాయ రంగంపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారుగా 3,000 హెక్టార్లలో వరి, ఇతర రకాల పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇండియాలోనే బెస్ట్ ఫ్లైట్ సర్వీస్! ఒక్కసారిగా సంక్షోభంలోకి.. ఇండిగోకు ఏమైంది?
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిక..
ప్రస్తుతం ‘దిత్వా’ అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లాపై ఇంకా కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను కొనసాగిస్తోంది. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.