AP New DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈమేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఏపీ డీఐజీగా నియమించింది. తక్షణమే ఆయన్ను విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈయన ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలంటూ ఈసీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది.
అయితే డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ను ఈసీ బదిలీ చేయడంతో.. డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అందించింది. ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో ఉన్న ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను పరిశీలించిన ఈసీ హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ నూతన డీజీపీగా నియమిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబత్ర బాగ్చీ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈసీ ఆదేశాల మేరకు బదిలీ అయిన రాజేంద్రనాథ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కాగా, కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన ఇన్ చార్జ్ డీజీపీగా కొనసాగనున్నారు.