Ex IPS Lakshmi Narayana Threats: ఎన్నికల దగ్గరపడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ మాజీ ఐపీఎస్ అధికారి, జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. బెదిరింపు కాల్స్ వెనుక మాజీ మంత్రి, ఓబులాపురం మైనింగ్ కేసు నిందితుడు గాలి జనార్థన్రెడ్డి సన్నిహితుడు సంబాల రాజేష్కుమార్ ఉన్నారన్నది అందులోని సారాంశం.
ఇటీవల ఓ సమావేశంలో సంబాల రాజేష్ అందరి ముందు బాహాటంగానే మాజీ జేడీని హతమారుస్తామంటూ నోరు విప్పి అందరి ముందు చెప్పారట. మా బాస్ గాలి జనార్థన్ రెడ్డిని మాజీ జేడీ చాలా ఇబ్బంది పెట్టారని, అందుకు ప్రతీకారం తీర్చుకుని మా బాస్కు గిఫ్ట్ ఇస్తానని చెప్పడం సంచలనంగా మారింది. ఈ వార్త చివరకు లక్ష్మీనారాయణ చెవిలో పడడంతో ఆయన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేకే రాజు, గాలి జనార్థన్రెడ్డితో సంబాల రాజేష్ కుమార్ కలిసి ఉన్న ఫోటోను ఫిర్యాదు లేఖకు జత చేశారు మాజీ ఐపీఎస్.
ఇంతవరకు బాగానే ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. గాలి అనుచరులు మాజీ ఐపీఎస్ కోసం వైజాగ్లో మకాం పెట్టారా? దీనివెనుక ఏదైనా రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయా? ఇవే ప్రశ్నలు చాలామంది రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి. ఓబులాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేశారు అప్పటి ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. ఈక్రమంలో మాజీ మంత్రి గాలి జనార్థన్రెడ్డి చాలా ఏళ్లు జైలులో ఉన్నారు. ఇటు అక్రమాస్తుల కేసులోనూ జగన్ కూడా దాదాపు 18 నెలలు జైలులోనే ఉన్నారు.
ALSO READ: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి..
సీన్ కట్ చేస్తే.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు బరిలో ఉన్నారు. ఆయన వెంట రాజేష్కుమార్ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణ కూడా బరిలో ఉన్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.