Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని నిర్దేశించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమైందని పేర్కొంది. అందుకే దర్యాప్తు పూర్తి చేయడానికి కాలపరిమితిని విధిస్తున్నామని స్పష్టం చేసింది.
మరోవైపు వివేకా హత్యలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన దర్యాప్తు అధికారి రామ్సింగ్ పై వేటు వేసింది. ఆయనను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ ఇచ్చిన సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సిట్కు సీబీఐ డీఐజీ కె.ఆర్.చౌరాసియా నాయకత్వం వహిస్తారు. సిట్ బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేశ్ కుమార్, ఇన్స్పెక్టరు ఎస్. శ్రీమతి, నవీన్ పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉంటారు.
వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ ను సుప్రీకోర్టు తిరస్కరించింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేసింది. 6 నెలల్లోపు ట్రయల్ మొదలుకాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. అయితే మెరిట్స్ ఆధారంగానే బెయిల్పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల ప్రభావం బెయిల్ పిటిషన్పై ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కొత్తగా సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ బృందం వివేకా హత్యకేసు దర్యాప్తును సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తుందా..?