AP Politics: ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయా? జూన్ నాటికి నాలుగు రాజ్యసభ సీట్ల ఖాళీ అవుతున్నాయా? అన్నింటిలో టీడీపీ దక్కించుకోవాలని ఆలోచన చేస్తోందా? టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు ఒకొక్కటి ఇస్తుందా? లేకుంటే టీడీపీ మూడు తీసుకుని, జనసేనకు ఒకటి ఇస్తుందా? దీనిపై టీడీపీ సీనియర్లు ఏమంటున్నారు? అనేదానిపై చర్చ జోరుగా సాగుతోంది.
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ?
ఏపీలో రాజ్యసభ సీట్ల అంశం వేడెక్కింది. జూన్ 21 నాటికి నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, సానా సతీష్బాబు ఉన్నారు. మొదటి ముగ్గురు వైసీపీ నేతలు కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సానాని పెద్దల సభకు పంపింది టీడీపీ. నాలుగు సీట్లకు టీడీపీ, జనసేన నుంచి కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఏపీ బీజేపీ నుంచి పెద్దగా రేసులో ఎవరూ కనిపించలేదు.
ప్రస్తుతం దావోస్లో సీఎం చంద్రబాబు అమరావతికి రానున్నారు. కేంద్ర బడ్జెట్ పరిశీలించిన తర్వాత నాలుగు సీట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయమై తొలుత చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య చర్చ జరగనుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి ఈసారి ఎవరైనా రేసులో ఉంటారా? లేదా అనేది సస్పెన్స్.
కూటమిలో మిత్రుల మధ్య చర్చ.. ఢిల్లీకి చంద్రబాబు-పవన్?
తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్తోపాటు మరో ఇద్దరు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరి కాకుండా పార్టీని నమ్ముకున్న కొందరు సీనియర్లకు అధినేత చోటు కల్పిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన పార్టీ విషయానికి వద్దాం.
రాజ్యసభలో అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో జనసేన భావించింది. గతేడాది పెద్దల సభలో అడుగుపెట్టాలని ఆలోచన చేసింది. వెస్టుగోదావరికి చెందిన వ్యక్తికి బీజేపీ ఆ సీటు కేటాయించింది. ఈసారి రాజ్యసభ సీటు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఆ సీటుకు లింగమనేని రమేష్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారట. మరో ఇద్దరు నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగ లేదన్నా ఈసారి జనసేనకు ఓ సీటు రావడం ఖాయం.
ALSO READ: దావోస్లో బిజీగా చంద్రబాబు-లోకేష్.. ఏఐ-ఫిన్ టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు
నాలుగు సీట్లను టీడీపీ తీసుకుంటుందా? 2028లో ఖాళీ అయ్యే సీట్లను బీజేపీ, జనసేనకు ఇస్తుందా? ఖాళీ కానున్న నాలుగు సీట్లలో టీడీపీ మూడు, జనసేన ఒకటి తీసుకుంటాయా? మరో రెండేళ్లలో ఖాళీ అయ్యే సీటును బీజేపీకి ఇవ్వనుందా? అనేదానిపై కూటమి నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అన్నట్లు.. కేంద్ర బడ్జెట్ తర్వాత మోదీ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి జనసేనకు మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా ఆ పార్టీ నుంచి ఒకరు రాజ్యసభ వెళ్లడం ఖాయం.