Bank Holidays: జనవరి చివరి వారంలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. జనవరి 24న నాలుగో శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణంగా వచ్చే ఈ మూడు రోజుల సెలవులకు తోడు, మరుసటి రోజైన జనవరి 27 (మంగళవారం) నాడు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా నాలుగో రోజు కూడా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను చేపడుతున్నాయి. ఈ నాలుగు రోజుల సుదీర్ఘ విరామం వల్ల చెక్కుల క్లియరెన్స్, నగదు విత్డ్రాయల్స్, ఇతర బ్రాంచ్ సంబంధిత పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
అయితే బ్యాంక్ బ్రాంచ్లు మూతపడినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, UPI (Google Pay, PhonePe) ద్వారా చేసే ఆన్లైన్ నగదు బదిలీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, ఖాతాదారులు తమకు అవసరమైన నగదును ముందుగానే డ్రా చేసి పెట్టుకోవడం మంచిది.
Also Read: ప్రాణాలు పోయాల్సిన చేతులే ప్రాణాలు తీశాయి.. విషపు ఇంజక్షన్తో వృద్ధ దంపతుల హత్య!
అలాగే సమ్మె ప్రభావం అన్ని బ్యాంకులపై ఒకేలా ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కావున, బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే, ఈరోజే లేదా రేపటి లోగా పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్ళీ బుధవారం (జనవరి 28) నుండి బ్యాంకులు సాధారణ స్థితిలో పనిచేస్తాయి, అయితే అప్పటికి పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటం వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉంది.