Ganja Cultivation: ఒకప్పుడు అడవులు, పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి మొక్క.. ఇప్పుడు మైదాన ప్రాంతాలకూ విస్తరిస్తోంది. నివాస గృహాల మిద్దెలపై, పంట పొలాల్లో, అద్దె ఇళ్ల ఆవరణల్లో గంజాయి సాగు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయి. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుండటం అధికారులను సైతం కంగారు పెట్టిస్తోంది.
గంజాయి ఒకప్పుడు ఔషధ మొక్కగా వైద్యపరమైన అవసరాలకు మాత్రమే వినియోగంలో ఉండేది. వైద్యుల పర్యవేక్షణలో దీర్ఘకాలిక నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలకు గంజాయిని ఉపయోగించేవారు. కానీ నేడు అదే గంజాయి మత్తు పదార్థంగా మారి, యువతను అంధకారంలోకి నెట్టేస్తోంది. డ్రగ్స్తో పాటు గంజాయి వినియోగం పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల వరకూ విస్తరించడం సమాజానికి పెనుప్రమాదంగా మారింది.
పోలీస్, ఎక్సైజ్, ఇతర నిఘా సంస్థలు ఎంతగా కట్టడి చేస్తున్నప్పటికీ గంజాయి సాగు, అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. కొందరు కేటుగాళ్లు గంజాయి అమ్మకాలను ఉపాధిగా మార్చుకుని అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. సరదాగా మొదలైన గంజాయి వినియోగం చివరకు వ్యాపారంగా మారి, అనేక మంది యువత జైళ్ల పాలవుతోంది.
ఒరిస్సా – ఏపీ గంజాయి మూలాలు
ఒరిస్సా రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలు, మారుమూల గ్రామాలు గంజాయి సాగుకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుండగా, ఒక ఎకరంలో సగటున 450 నుంచి 500 గంజాయి మొక్కలు పెరుగుతాయి. ఒక ఎకరం గంజాయి సాగు చేస్తే రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో రైతులు, మధ్యవర్తులు ఈ అక్రమ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
అదే విధంగా ఏపీలోని విశాఖ ఎజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో శీలావతి అనే రకం గంజాయి విస్తృతంగా సాగవుతోంది. ఈ రకానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 5 గ్రాముల గంజాయికి రూ.500 ధర పలుకుతుండగా, ఒక కిలో గంజాయి రూ.లక్ష వరకు అమ్ముడవుతోంది.
తెలంగాణ మీదుగా అక్రమ రవాణా
ఒరిస్సాలో పండిన గంజాయిని మల్కాన్గిరి జిల్లా మీదుగా తెలంగాణకు తరలించి, అక్కడి నుంచి గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఖమ్మం, భద్రాచలం మార్గాలు గంజాయి రవాణాకు కీలక కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ వాహనాలు, బస్సులు, రైళ్ల ద్వారా గంజాయిని తరలిస్తూ దొరికితే దొంగ, లేకపోతే లక్షాధికారి అన్న ధోరణితో అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు.
నగరాల్లో కొత్త రూపం
ఇటీవల గంజాయి సాగు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అద్దె ఇళ్ల మిద్దెలపై, గోదాంలలో గంజాయి మొక్కలు పెంచడం మొదలైంది. బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కొందరు వ్యక్తులు మొదట స్వంత వినియోగం పేరుతో గంజాయి మొక్కలు పెంచి, ఆ తర్వాత వాటిని వ్యాపారంగా మార్చుతున్నారు.
మలక్పేట్ ప్రాంతంలో పది కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఘటన, వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో 108 గంజాయి మొక్కల పట్టివేత వంటి ఘటనలు ఈ ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ గంజాయి సాగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
గణాంకాలు భయపెడుతున్నాయి
2021 నుంచి 2025 వరకు ఒక్క ఎక్సైజ్ శాఖే 21,050 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా 24,245 కేజీల డ్రై గంజాయిని వివిధ విభాగాలు పట్టుకున్నాయి. ఇవి నమోదైన కేసులే కాగా, వెలుగులోకి రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం.
కఠిన అమలు అవసరం
గంజాయి ప్రాణాంతకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం 1985లో.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్లో గంజాయిని చేర్చింది. గంజాయి సాగు, అమ్మకం, రవాణా, వినియోగం నేరమే అయినా మార్కెట్లో దొరుకుతుండటం వ్యవస్థలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రత్యేక చర్యలు
డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ షాన్వాస్ ఖాసీం (ఐపీఎస్) తెలిపినట్లుగా, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చెక్పోస్టులు పటిష్టం చేసి, ఎక్సైజ్, టీజీ నాబ్, పోలీస్, ఈగల్ వంటి నిఘా సంస్థలు సమన్వయంతో పని చేస్తున్నాయి.
Also Read: ముంబైలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణం.. టీటీడీ గ్రీన్ సిగ్నల్
అడవుల నుంచి అద్దె ఇళ్ల మిద్దెల వరకు పాకుతున్న గంజాయి సాగు యువత భవిష్యత్తును మింగేస్తోంది. ఈ మత్తు మహమ్మారిని అరికట్టాలంటే కేవలం పోలీసు చర్యలే కాకుండా, సామాజిక చైతన్యం, కుటుంబాల జాగ్రత్త, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. లేదంటే, గంజాయి అనే కాన్సర్ సమాజాన్ని పూర్తిగా కబళించే ప్రమాదం తప్పదు.