బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ సభలో అపశృతి చోటు చేసుకుంది. వేమూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సభ మధ్యలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అలిగి వెళ్లిపోయారు.
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఫోటోలు లేకపోవడం ఈ వివాదానికి మూల కారణం. ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉండి కూడా తన ఫోటోను ఫ్లెక్సీలలో పెట్టకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. ఇది తనను అవమానించడమేనని భావించిన ఆనందబాబు నిర్వాహకుల తీరును నిరసిస్తూ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై ఆయన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరు ఎమ్మెల్యే సభను బహిష్కరించడంతో ఈ విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే నిరసనతో కొంతసేపు సభలో గందరగోళం నెలకొంది.
ఈ సంఘటనపై నిర్వాహకులు లేదా ఎమ్మెల్యే ఆనందబాబు నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. అయినప్పటికీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు