Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లోని డీఎస్సీ నియామకాలపై రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకం+గా జరగలేదని, కష్టపడి చదివిన అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
అక్రమాలు.. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం
ప్రభుత్వం 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని చెబుతున్నప్పటికీ.. ఈ ప్రక్రియలో రోజుకో అక్రమం బయటపడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పేపర్ లీకేజీలు, ప్రశ్నపత్రాల విక్రయాలు జరిగాయని మండిపడ్డారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి, నకిలీ సర్టిఫికెట్లతో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. స్వయంగా ప్రభుత్వ శాఖలే కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తప్పుడువని తేల్చడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు.
సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్
అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేసి తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నియామకాలపై కూడా అనుమానాలు ఉన్నాయని, ఈ రెండింటిపై తక్షణమే సీబీఐ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తప్పు జరగలేదని నిరూపించుకునే ధైర్యం కూడా ప్రభుత్వానికి లేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈనెల 21న విజయవాడలో భారీ నిరసన
నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని అంబటి స్పష్టం చేశారు. బాధితులకు క్షమాపణ చెప్పి, అర్హులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే వరకు వదిలిపెట్టబోమన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని శాప్ ఆఫీస్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
Also Read: అసెంబ్లీని చెడగొట్టడమే వారి కుట్ర.. బీఆర్ఎస్ తీరుపై బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు!