ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఫలితంగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారాలతో జగన్.. జనాన్ని మోసం చేస్తున్నారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు దాదాపు అమలు అవుతున్నాయని వారు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్, పెన్షన్లు, విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేశారని గుర్తుచేస్తున్నారు.
మాజీ సీఎం జగన్,వైసీపీ నేతలు ఆరు గ్యారెంటీలపై చేస్తున్న విమర్శలకు తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే ఇలా విమర్శలు చేయడం సబబు కాదని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో జగన్ అరాచక పాలనను ప్రజలకు అర్థం అయ్యేలా మరోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఉచితాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా జగన్ మార్చారని, మూడు రాజధానుల పేరిట ఐదేండ్లు కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పెట్టుబడులు రాకుండా చేసిన విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో నవరత్నాలు(ఉచిత పథకాల) పేరిట జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన విషయం ప్రజలు మర్చిపోయారా? అని కూటమి నేతలు గుర్తుచేస్తున్నారు.అడ్డగోలు ఉచితాల పేరిట కరెంట్ బిల్లుల పెంపు, బస్సు చార్జీల పెంపు, చెత్తకు పన్ను.. అంతేకాకుండా జగన్ హయాంలో అక్రమాలు, అన్యాయాలు, పెరిగిన నేరాలు.. వైసీపీ నేతల ఆగడాలు, భూ కబ్జాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అధికారుల పవర్స్ ఎలా హరించబడ్డాయో గుర్తుందా? అని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. జగన్ హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి లెక్కలు తీయాలని అడుగుతున్నారు. జగన్ నిజంగానే పారదర్శక పాలన అందిస్తే 150 సీట్లు గెలిచిన పార్టీ.. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు ఎలా పడిపోయిందో చెప్పాలని కోరుతున్నారు.
జగన్ పాలనలో సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు కూటమినేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, రైతులకు రుణమాఫీ, కేంద్రం నుంచి అడ్డగోలుగా చేసిన అప్పుల కారణంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతుందని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు తగ్గించడంతో పాటు ప్రజలపై మరోసారి పన్నుల భారం మోపకుండా.. రాజధాని పనులను స్పీడప్ చేస్తూనే పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు. కరెంట్ బిల్లులు పెంచాలని డిస్కంలు కోరగా.. చంద్రబాబు అందుకు నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కేంద్రంతో చంద్రబాబు దోస్తీ కారణంగానే రాష్ట్రానికి ఇతర రాష్రాల కంటే అధికంగా నిధులు, ప్రాజెక్టులు, కంపెనీలు వస్తున్నాయని, పొలవరం నిర్మాణం జరుగుతోందని, శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం, గూగుల్ డేటా సెంటర్, మల్టీ నేషనల్ కంపెనీలు విశాఖకు వచ్చి పెట్టుబడులు ప్రకటించిన విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తున్నారు. జగన్ ఉంటే ఇవన్నీ వచ్చేవా? రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయేదని, ఆయనకు విజన్ లేదని.. చంద్రబాబు విజన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదని కూటమి నేతలు, టీడీపీ నేతలు చెబుతున్నారు.