Heatwaves in AP: ఏపీలో రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. దీనికితోడు వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుధవారం వివిధ జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక
అగ్నికర్తెల ప్రభావం.. నైరుతి పవనాల రాక ముందు ఏపీలో ఎండల తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. ఎండలకు తోడు వడగాలులు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 71 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తేల్చి చెప్పింది.
బుధవారం నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాలు, రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్ర వడగాల్పులు, ఆపై 47 డిగ్రీలు
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని తెలియజేసింది. ఆయా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉమ్మడి నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ కావచ్చని తెలిపింది.
అనంతపురం, కడప జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాలుల తీవ్రత అధికంగా మారనున్నట్లు తెలిపింది. 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అనకాపల్లి జిల్లా-20 మండలాలు, శ్రీకాకుళం-18, కాకినాడ- 9, కోనసీమ-7, విజయనగరం- 6, పోలవరం- 4, విశాఖపట్నం-4 మండలాలపై ప్రభావం చూపనున్నట్లు ప్రస్తావించింది.
ALSO READ: సినిమా స్క్రిప్ట్ను మించిన పాస్టర్ ‘దాడి’ డ్రామా.. క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పట్టణ స్థానిక సంస్థలను హై అలర్ట్ చేసింది. మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.23 జిల్లాల్లోని 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పగటి వేళ ప్రయాణాలు దూరంగా ఉండాలని వైద్యులు సూచన చేస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.