AP High Court: సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకరమైన కంటెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇలాంటి వాటిపై పోలీసులు నిద్రపోతుంటే.. నేరస్థులు దూకుడుగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏ విషయంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
సోషల్మీడియా-అభ్యంతరకరమైన ఫెక్సీలపై హైకోర్టు ఆగ్రహం
ఇమిగ్రేషన్ అధికారులు తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టింది. పోలీసుల చేతకానితనం వల్ల సోషల్మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడింది.
2029 లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ విజయవాడలో ఫ్లెక్సీ పెట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటివి పబ్లిక్గా పెడుతున్నారంటే వారికెంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంను అవమానించడమంటే ఐదు కోట్ల మంది ప్రజల్ని అవమానించడం కాదా? ప్రశ్నలు లేవనెత్తింది.
పోలీసులపై సీరియస్.. సజ్జల భార్గవ్ పిటిషన్ తీర్పు రిజర్వ్
2020లో హైకోర్టు జడ్జిలపై పోస్టుల కేసు సీబీఐకి అప్పగించినా ఫలితం లేదని తెలిపింది. సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరికీ లేవని తేల్చి చెప్పింది. దీనికి పోలీసుల అసమర్థత కారణం కాదా? అంటూ నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.
ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలన్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని పేర్కొంది. అభ్యంతరకర పోస్టులపై పోలీసులు సీరియస్గా చర్యలు తీసుకోలేదని తేల్చేసింది. 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది ధర్మాసనం. పోలీసులు నిద్రపోవడం వల్ల పోస్టులు పెట్టేవాళ్లు రెచ్చిపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేసింది.
ALSO READ: సోషల్మీడియాపై బ్యాన్.. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా
ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసుల దర్యాప్తు సక్రమంగా జరిగి నిందితులను కోర్టు ముందు ఉంచితే ఇంత ధైర్యం చేసే వాళ్లా అంటూ పోలీసులను నిలదీసింది. పోలీసులు, సీఐడీ, సీబీఐ ఏమీ చేయరనే ధైర్యంతో ఈ తరహా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించింది.
జడ్జిలపై పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలకు ఆదిలో అడ్డుకట్ట వేయకపోవడం ముమ్మాటికీ పోలీసులది తప్పేనని పేర్కొంది. సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.