Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ-తెలంగాణల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు-మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాయుగుండం తగ్గుముఖం పట్టడంతో రుతుపవనాలు జోరు మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి సమీపంలో ఆవరించిన రుతుపవన ద్రోణి.. బికనేర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వరకు వ్యాపించింది. అవి సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉన్న మరొక ద్రోణి బలహీనపడింది. జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
ముఖ్యంగా వర్షాల ప్రభావం కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలు పడే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురు గాలుల నేపథ్యంలో చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఈ విషయంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు వాతావరణ పొడిగా ఉంటుందని, సాయంత్రం నుంచి రాత్రి వరకు మళ్లీ వర్షం పడే సూచనలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాంలో ఆగస్టు 3-6 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 3 రాత్రి నుంచి 4 ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నేటి నుంచి అనగా ఆగస్టు 4 నుంచి 6 వరకు ఉరుములు-మెరుపులతో కూడిన గాలులు వీయనున్నాయి. రాయలసీమలో ఆగస్టు 3-4 తేదీల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ALSO READ: ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?