ఒకే కుటుంబం, అన్నదమ్ముల బిడ్డలు. కలసి మెలసి పెరిగారు. ఒకరంటే ఒకరికి బాగా అభిమానం. కానీ రాజకీయం ఆ కుటుంబాలను బద్ధ శత్రువులుగా మార్చింది. వైఎస్ఆర్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి ఎంత ఆప్యాయంగా ఉండేవారో, వారి బిడ్డలు మాత్రం ఒకరికొకరు ఎదురుపడినా పలకరించుకోనంతగా పగ పెంచుకున్నారు. దానికి కారణాలున్నాయనుకోండి. అయితే ఇన్నాళ్లు ఒకరికొకరు ఎదురుపడకుండా వేర్వేరుగా ఉన్నవారిని విధి ఒకేచోటకు చేర్చింది. నాంపల్లి సీబీఐ కోర్టు అందుకు వేదికగా మారింది. ఒకరికొకరు ఎదురుపడగా జగన్, సునీత ఎడమొహం పెడమొహంగా వెళ్లిపోయారని తెలుస్తోంది.
వివేకా హత్యతో..
వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం వైఎస్ఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. ఆయనది ఆత్మహత్య అంటూ మొదట్లో సాక్షి టీవీ వార్తలిచ్చింది. ఆ వార్తలకు కారణం అక్కడ ఉన్న వారు చెప్పిన వివరాలేనని తేలింది. హత్య చేసి ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించారనే విషయం నిర్థారణ అయినా, హత్య చేసిన వారు తమ తప్పు ఒప్పుకుని ఎవరు ఆ పనికి ప్రోత్సహించారనే విషయాన్ని విచారణ అధికారుల ముందు చెప్పినా ఇంత వరకు అసలు నిందితులకు శిక్ష పడలేదు. ఆ మాటకొస్తే కోర్టు ఇంకా నేర నిర్థారణ కూడా చేయలేదు. వివేకానందరెడ్డి హత్యకేసు ఎడతెగని కథలా సాగుతూనే ఉంది. హంతకులకు జగన్ రక్షణ కల్పిస్తున్నారని సునీత అనుమానం. ఓ దశలో సునీత కుటుంబంపైనే నిందలు మోపేలా జగన్ వర్గం మాట్లాడింది. దీంతో వారిద్దరికీ మాటల్లేవు. జగన్ చెల్లెలు షర్మిల మాత్రం సునీతకు అండగా నిలబడ్డారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.
కోర్టులో ఎదురెదురు పడిన అన్న చెల్లెలు
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు వైఎస్ వివేకా కుమార్తె సునీత ఈరోజు నాంపల్లి కోర్టుకి వెళ్లారు. వివేకా హత్య కేసులో నిందితులు ఏ5, ఏ7, ఏ8 లకు వ్యతిరేకంగా సునీత వాదనలు వినిపించారని తెలుస్తోంది. ఈ క్రమంలో నాంపల్లి కోర్టుకి వెళ్లిన ఆమెకు సడన్ గా జగన్ ఎదురు పడ్డారు. అయితే జగన్ ని చూసిన ఆమె వెంటనే మొహం పక్కకు తిప్పుకున్నారు. జగన్ కూడా ఆమెను చూసీ చూడనట్టు వెళ్లిపోయారని అంటున్నారు.
Also Read: బాబు, లోకేష్, పవన్, జగన్.. ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నారు?
అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత విచారణకోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు జగన్. అయితే ఇటీవల విదేశాలకు వెళ్లేందుకు ఆయన కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. విదేశాలనుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయన కోర్టు ముందు హాజరయ్యారని అంటున్నారు. ఈ కేసు విచారణకోసం ఆయన కోర్టుకి వచ్చిన సమయంలో సరిగ్గా సునీత కూడా వివేకా హత్యకేసు విచారణకోసం అక్కడే ఉన్నారు. అప్పుడే అన్న చెల్లెలు ఎదురెదురు పడినా కనీసం పలకరించుకోలేదని తెలుస్తోంది. చిన్నప్పుడు అన్నదమ్ముల బిడ్డల్లా ఆప్యాయత పంచుకున్న వారిద్దరు ఇప్పుడు ఇలా ఎదురవడం, కనీసం పలకరించుకోకుండా వెళ్లిపోవడం విశేషం.
Also Read: నేను నెంబర్-1, కేటీఆర్ నెంబర్-2.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు