తెలంగాణలో ఫార్ములా E కార్ రేసు నిర్వహణలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పేరు కూడా ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కావడంతో విచారణకు గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా గవర్నర్ అనుమతివ్వడంతో కేటీఆర్ పై విచారణ వేగవంతం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కి బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత నుంచి ఊహించని మద్దతు లభించింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అని అన్నారు కవిత. దేశంలో కక్ష పూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నేను నెంబర్-1, కేటీఆర్ నెంబర్-2
కేటీఆర్ పై నమోదైన కేసు, విచారణకు గవర్నర్ ఆమోదించడంపై కవిత స్పందించడం విశేషం. అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలోని నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న వారు రాష్ట్రంలోని పార్టీలపై కక్ష సాధిస్తున్నాయని చెప్పారు కవిత. వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు కేసులు పెట్టడమే పనిగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలకు బలవుతున్న వారిలో తెలంగాణ నుంచి తాను నెంబర్-1 స్థానంలో ఉన్నానని, ఇప్పుడు ఈవీ కార్ రేసింగ్ ల కేసులో కేటీఆర్ నెంబర్ 2 గా మారారని అన్నారామె. పరోక్షంగా అన్నపై సింపతీ చూపించారు.
దేశంలో కక్ష పూరిత రాజకీయాలు జరుగుతున్నాయి: కవిత
వాళ్ల మీద, వీళ్ల మీద కేసులు పెట్టడమే బీజేపీకి ఉన్న పని. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు.
ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు.
– కవిత pic.twitter.com/4P7EZAGuBn— ChotaNews App (@ChotaNewsApp) November 20, 2025
పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు కవిత. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీల్లో మొహం చూపించుకోలేకపోతోందని అన్నారామె. అందుకే కేసులతో కాలయాపన చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. కోర్టులు, చట్టాలపై తమకు నమ్మకం ఉందన్నారు.
కవిత టార్గెట్ ఎవరు?
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత ప్రధానంగా హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తనను అవమానించి బయటకు పంపారంటూ మొదట్లో కేసీఆర్, కేటీఆర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినా, ఇప్పుడు పూర్తిగా తన టార్గెట్ హరీష్ రావు అని స్పష్టమయ్యేలా మాట్లాడుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ పై కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రమే ఆమె చెబుతున్నారు. అదే కేసు హరీష్ పై నమోదై ఉంటే మాత్రం ఆయన చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నారని స్టేట్ మెంట్ ఇచ్చేవారేమో. రాగాపోగా హరీష్ రావు బయటకు వెళ్తే కవిత బీఆర్ఎస్ లోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి కవిత వేరు కుంపటి పెట్టుకున్నా, తండ్రి, అన్నతో మాత్రం విభేదాలు కొని తెచ్చుకునేలా లేరు. ఒకవేళ వారికి వారే కవితను మరింత దూరం పెడితే 2029 ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ వేదికను బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కి అది మరింత నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ కేడల్ లో ఉన్న అసంతృప్తులు, పార్టీ పదవుల విషయంలో అసంతృప్తులు కవిత వద్దకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి, షాకైన బీఆర్ఎస్ నేతలు