ఏపీలో మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశంపై ప్రతిపక్ష వైసీపీ ఆందోళనలు తెలుపుతూనే ఉన్నది. ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం ఇప్పటికే కోటీ సంతకాల సేకరణ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కాపీలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని రాష్ట్ర గవర్నర్కు అందజేయాలని వైసీపీ అధినాయకత్వం సంకల్పించింది. అందుకోసం రేపు(గురువారం) మాజీ సీఎం జగన్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. కాపీలను ఓ వాహనంలో తీసుకెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ విద్యను ప్రోత్సహించేందుకు పెద్దమొత్తంలో కాలేజీలు కట్టించేందుకు పీపీపీ(పబ్లిక్ ప్రయివేటు) భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ విధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే, మెడికల్ విద్యను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని, తద్వారా వెనకబడిన వర్గాలకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ శ్రేణులు, నేతలు మీడియా ముందు, సోషల్ మీడియాలో తెగప్రచారం చేస్తున్నారు. కాగా, జగన్ ప్రతిపాదనను గవర్నర్ అంగీకరిస్తారా? ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోగలరా? అనే అంశంపై స్పష్టత కరువైంది.
మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ కోసం పీపీపీ విధానం కరెక్ట్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందని చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి విడుదల రజినీ ఆరోపించారు. ఆ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ పెంచాలని, అసమాతనలను తగ్గించాలని సూచించిందని, వైద్య విద్యకు తగిన నిధులు లేకపోతే పీపీపీ విధానాన్ని తీసుకోవచ్చని చెప్పిందని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమి,ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిధులు ఉన్నప్పుడు పీపీపీ ఎందుకని ఆమె ప్రశ్నించారు. మాజీ మంత్రి,మాజీ సీఎంకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు కోసమే 10 వరకు వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అది ప్రయివేటీకరణ కాదన్నారు.జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం, కోర్టులు సైతం పీపీపీని సమర్థించాయని చెప్పారు. అవసరమైతే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లాలని సూచించారు.
మాజీసీఎం జగన్, ఆ పార్టీలు నేతలు చేస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. జిల్లా కలెక్టర్లతో సమావేశంలో భాగంగా ఆయన మీడియాకు పీపీపీ విధానంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించి, నిర్వహిస్తామని అన్నారు.కానీ, దానిపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానిదే ఉంటుందని, ప్రయివేటుకు పెత్తనం ఇవ్వబోమని స్పష్టంచేశారు.నిధులు లేకనే ఈ విధానాన్ని ఎంచుకున్నామన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్ ఎంత రాద్ధాంతం చేసినా వెనక్కి తగ్గేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.ఎట్టకేలకు మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ప్రచారంపై సీఎం క్లారటీ ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆందోళన తగ్గనుందని ప్రచారం జరుగుతోంది.