Diamond Jubilee celebrations: కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి.. కళాశాల స్థాపన నుంచి ఇప్పటివరకు సాగిన ప్రయాణాన్ని స్మరించుకున్నారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవానంద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ప్రతి సంస్థ తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
మనుషులు శాశ్వతం కాదని.. వారు చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని నాగార్జున గుర్తు చేశారు. 1951లోనే కళాశాల అభివృద్ధి కోసం అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు మద్దతుగా నిలవాలనే సంకల్పంతో.. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు అందించనున్న స్కాలర్షిప్ కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్న ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ స్మారక పుస్తకాన్ని నాగార్జున ఆవిష్కరించారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరించాలని నాగార్జున కోరారు. ఈ వేడుకలు కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచాయి.