Janasena party latest news today(AP news live): ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మారుతున్నాయి కూడా. ఇప్పటికే జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
నామినేషన్లు పరిశీలన ముగియడంతో రేసులో ఉన్నమిగతా అభ్యర్థులకు ఎన్నికల అధికారులు జనసేన సింబల్ను కేటాయించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేన పోటీ చేసే సీట్లతోపాటు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు.
పరిస్థితి గమనించిన జనసేన మంగళవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. పొత్తుల్లో భాగంగా కొద్ది సీట్లకు తాము పోటీ చేస్తున్నట్లు అందులో ప్రస్తావించింది. మరోవైపు ఇదే అంశంలో తమ వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని అందులో పేర్కొంది. న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను జనసేన అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంల్లో తమ పార్టీ నెంబర్ ఎంతో చెబుతూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.