Weather Updates: ఎప్పుడూ లేనంతగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ వేడిమి ప్రారంభమై సాయంత్రం నాలుగైదు అవుతున్నా తగ్గడంలేదంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో అర్థం చేసుకోవొచ్చు.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ నమోదయ్యాయో.. ఆ వివరాలను తెలియజేసింది. పశ్చిమబెంగాల్ లోని కలాయ్ కుందాలో మంగళవారం 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. దేశంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయని పేర్కొంది. కలాయ్ కుందాలో ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
Also Read: ‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి’
ఎండలు దంచి కొడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని తెలియజేస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఎండదెబ్బకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.