JC Prabhakar: అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన నాయకుల జాబితాను బయటపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
24 మంది వైసీపీ నాయకుల చిట్టా విడుదల
గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అవినీతికి పాల్పడిన 24 మంది వైసీపీ నాయకుల పేర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్షంగా వెల్లడించారు. ‘ఆ 24 మంది చేసిన అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే అందులో ముగ్గురిని సరిగ్గా ‘ఉతికి ఆరేశారు’. మిగిలిన 21 మందికి కూడా తగిన సమయం ఆసన్నమైంది, ఎవరినీ వదలం’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారు
గత ప్రభుత్వ హయాంలో తనపై మాత్రమే కాకుండా, తన ఇంట్లోని మహిళలపై కూడా వైకాపా నాయకులు అనేక అక్రమ కేసులు బనాయించారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముందు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే మాకు తగిన మూల్యం చెల్లిస్తామని వారు బెదిరిస్తున్నారు. అందుకే, వారు మాకు మూల్యం చెల్లించేకంటే ముందే, మేమే వారికి సరైన రీతిలో మూల్యం చెల్లిస్తున్నాం’ అని విస్పష్టంగా స్పష్టం చేశారు.
తాడిపత్రిలో పార్టీలు లేవు… వర్గాలే ఉన్నాయి
తాడిపత్రి రాజకీయంపై మాట్లాడుతూ.. ఇక్కడ టిడిపి, వైసిపి అనే సంబంధం కంటే జేసీ వర్గం, కేతిరెడ్డి వర్గం మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. తమకు వైకాపా పార్టీపై కానీ, సాధారణ కార్యకర్తలపై కానీ ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. కేవలం అరాచకాలకు పాల్పడిన ఆ 24 మందిపైనే తమ పోరాటమని చెప్పారు. ఆ 24 మందికి ఎవరు మద్దతుగా నిలిచినా వారిని కూడా తమ శత్రువులుగానే భావిస్తానని ఖరాకండిగా చెప్పారు.
ఆగస్టు 6న బాధితుల నిరసన
తాడిపత్రి పూర్వ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధితులందరితో కలిసి ఆగస్టు 6న తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. గతంలో జరిగిన అన్యాయాలపై న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.
Also Read: లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!