Kasibugga Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఇది చంద్రబాబు పరిపాలనలో ఘోర వైఫల్యమే అని విమర్శించారు. రాష్ట్రంలోని పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రత, ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను గాలికి వదిలేశారని ఆరోపించారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ, ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదన్నారు.
ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత అన్నారు.
“ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్పస్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చినజీయర్స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తోందంటే దాని అర్థం తప్పు జరిగినట్టే కదా?” -వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని వైఎస్ జగన్ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారని, కానీ ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది మరణించారన్నారు.
Also Read: CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు
మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, సత్వర చికిత్స అందించి, ఇద్దరు భక్తుల ప్రాణాలను కాపాడమే కాదు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు.