AP latest news: అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
వారానికి 5 వర్కింగ్ డేస్ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టింది. ప్రతి నెలా మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను జగనన్నకు చెబుదాం పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేశారు.