CM Chandrababu: కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే తన సంకల్పాన్ని తెలియజేశారు. కేవలం ఒక్క పిలుపుతో 4,500 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులు బదిలీపై విశాఖలో పనిచేయడానికి ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారందరికీ సాదర స్వాగతం పలికారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కాగ్నిజెంట్లో 80 శాతం మంది భారతీయులే పనిచేస్తున్నారని.. ఈ సంస్థ 34 బిలియన్ డాలర్ల వృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో భారీ లక్ష్యాలు పెట్టుకోవడం తన నైజమని.. హైదరాబాద్ అభివృద్ధి కూడా ఆ విధంగానే జరిగిందని స్పష్టం చేశారు. విశాఖలో ఉన్న వనరులు, సౌకర్యాలు దేశంలోని ఏ పెద్ద నగరానికి లేవని ఆయన అన్నారు. కాగ్నిజెంట్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. విశాఖలో 25 వేల నుండి లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది కాలంలో 25 వేల మంది పనిచేసే సెంటర్గా కాగ్నిజెంట్ పనిచేస్తుందని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మరో 8 కొత్త ఐటీ సెంటర్లకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.
విశాఖ నగరం అందమైన, ప్రశాంతమైన నగరమని, త్వరలోనే ఇదొక అద్భుత ప్రపంచంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో భోగాపురం విమానాశ్రయం, మెట్రో రైలు వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పు నావికాదళ నగరంగా పేరుగాంచిన విశాఖ, పర్యాటకంగానే కాక ఐటీ రంగంలోనూ ఒక స్థాయి గుర్తింపు సాధిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఈ నగరంలో 150 టెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిభకు కొదవ లేదని, ఇక్కడి యువత దేశ విదేశాల్లో పనిచేస్తున్నారని, ఇక్కడ నాయకత్వం కూడా ఉందని ఆయన నొక్కి చెప్పారు. విశాఖలో లివింగ్ కాస్ట్ 25 శాతం తక్కువగా ఉంటుందని.. ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, దీనికి సరైన ప్లానింగ్ లేకపోవడమే కారణమని అన్నారు. ఈ రోజు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్ష జరుగుతోందని.. విశాఖ నగరం ఇప్పటికే విమెన్ సేఫ్ సిటీగా గుర్తింపు పొందిందని తెలిపారు. 2032 నాటికి ఈ ప్రాంతంలో 135 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ALSO READ: Cognizant Visakhapatnam Campus: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు సీఎం శంకుస్థాపన