ONGC Gas Leak: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జీసీ స్పందించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఇరుసుమండ ఘటనాస్థలికి అగ్ని మాపక సిబ్బందిని పంపిస్తున్నామని పేర్కొంది. గ్యాస్ లీకైన ప్రదేశం మారుమూల ప్రాంతంలో ఉందని, అక్కడికి సుమారు 600 మీటర్ల వరకు నివాస ప్రాంతం లేదని తెలిపింది. గ్యాస్ లీక్ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. గ్యాస్ లీక్, మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నారని పేర్కొంది. గ్యాస్ లీక్ ఆపేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఓఎన్జీసీ సీనియర్ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని లేఖలో పేర్కొంది.
కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఇంకా గ్యాస్ లీకేజీ ఆగలేదు. గ్యాస్ లీకేజీతో మంటలు ఆరలేదని అధికారులు తెలిపారు. ఇరుసుమండ గ్రామం చుట్టూ కిలోమీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ లీక్ కాకుండా ఆపేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని.. గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలు ఆగుతాయని అధికారులు అంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం భారీగా గ్యాస్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్జీసీ బావికి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ ఎగిసిపడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద భయంతో ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీశారు గ్రామస్థులు.
Also Read: ఇరుసుమండ ఓఎన్జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు
ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు, మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. మంటలు అదుపులోకి వచ్చేందుకు 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు.