Ganja Seized: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మారుమూల గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సుమారు 8 ఎకరాల మాన్యం భూమిలో, కంది, మిరప పంటల మధ్య అంతర పంటగా ఈ గంజాయిని సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
డేగులపాడు గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య అనే రైతు గత నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ సాగును కొనసాగిస్తున్నాడని తెలిపారు పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య. స్థానిక కూలీలను పొలం వైపు రాకుండా బెదిరిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 4.96 కేజీల ఎండు గంజాయితో పాటు, దాదాపు 300 పచ్చి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఈగల్ టీమ్స్ నిఘా పెంచాయని, ఈ భారీ సాగు వెనుక ఎవరెవరు ఉన్నారో కూలంకషంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు డీఎస్పీ వెంకట రామయ్య. ఈ ఆపరేషన్లో సీఐ రవిశంకర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ లలితా దేవి, ఎస్సైలు సతీష్, మన్మధ విజయ్ తదితరులు పాల్గొన్నారు.