రాజకీయాల్లో ప్రభుత్వాలు మారడం కామన్. ఏదైనా ప్రజల చేతిలో ఉంటుంది. వారికి మంచి చేస్తే ఆదరిస్తారు లేదంటే ఉతికి ఆరేస్తారు. అందుకే పదవులు, కుర్చీలు శాశ్వతం కాదని తలపండిన రాజకీయ నేతలు, ప్రజా సమస్యలపై పోరాడే వారు నిత్యం చెబుతుంటారు. ఎంత చెప్పిన కొందరికి మాత్రం అస్సలే అర్థం కాదు. అందుకే ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవరించి చివరకు ఎన్నికల్లో బొక్కబొర్లా పడుతుంటారు.గత ఎన్నికల్లో వైసీపీకి సరిగ్గా ఇదే జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చాన్స్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామని.. ‘రెడ్ బుక్’ లాగే తామూ ఓ బుక్ పెట్టుకున్నామని.. పవర్లోకి వచ్చాక తమ సత్తా చూపిస్తామంటూ కొందరు వైసీపీ నేతలు బెదిరింపులకు దిగడం ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నది.
అధికారం ఉన్నంతసేపు ప్రజల ఇష్టాఇష్టాలు, ఇబ్బందులు, యువత సమస్యలు పట్టించుకోకుండా ఉచితాలు ఇస్తున్నాం కదా? సంక్షేమం ఒక్కటి చాలు మమ్మల్ని మరల గెలిపిస్తుందని బీరాలకు పోయారు గత పాలకులు. వై నాట్ 175 స్లోగన్తో ఎన్నికలకు వెళితే ప్రజలు ఏం చేశారు? లెంపకాయలేసి కూర్చోబెట్టారు..సరే..అసలెందుకు ఓడిపోయామనేది వైసీపీ నాయకులకూ అర్థం కావడం లేదని టాక్. గతంలో చాలా సార్లు మాజీ సీఎం జగన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. సరే గతం గతహా.. అనుకుని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై మాట్లాతున్నారా? అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారా? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా బెదిరింపులకు దిగారో మళ్లీ సేమ్ రిపీట్..
గత కొంతకాలంగా వైసీపీ నాయకులు, మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురిచేయడంపై మంత్రి నారాలోకేశ్ సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మాట్లాడితే వైసీపీ శ్రేణులు రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించడం, కూటమి సర్కార్ కక్ష సాధింపుచర్యలకు దిగుతోందని చేస్తున్న ఆరోపణలను గమనిస్తున్నట్లు సమాచారం. సమయం వచ్చిప్పుడు మాట్లాడుదామని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తుండగా.. ఇటీవల మెడికల్ కాలేజీలను పీపీపీ (పబ్లిక్ ప్రయివేటు) భాగస్వామ్యంలో నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తున్నది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేస్తామని, ఎవరైతే కాంట్రాక్టర్లు మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో తీసుకునేందుకు ముందుకు వస్తారో వారిని వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లో అరెస్టు చేస్తామని జగన్ హెచ్చరించారు. దీనిపై తాజాగా స్పందించిన మంత్రి లోకేశ్.. ఎవరి బెదిరింపులకు తమ ప్రభుత్వం భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ చట్టం ప్రకారం తన తాను చేసుకుంటూ వెళ్తుందని మంత్రి లోకేశ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.దీనిని బట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్న, బెదరింపులకు గురిచేస్తున్నవారిపైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు పంపారని జోరుగా చర్చ జరుగుతున్నది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన లీడర్లు అంతా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను రీ ఓపెన్ చేయిస్తారా? మిగతా లీడర్ల పనిపడితారా? అని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.