Hyderabad: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాతర క్రమంగా మొదలవుతోంది. తొలుత ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు లేక సిబ్బంది సతమతమవుతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా కొంత మందిని నియమించింది ఆ శాఖ. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీని ఆర్టీసీ యాజమాన్యం చేపట్టనుంది.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర-గతంలో మాదిరిగా ఈ ఉద్యోగాలకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఫోకస్ చేసింది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు.
1500 కండక్టర్ పోస్టుల భర్తీ-ప్రతి ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఖాళీలు పెరుగుతూ వచ్చాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఔట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా కొందర్ని నియమించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో కండక్టర్లను నియమించింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీ కానున్నాయి.
విద్యార్హతపై తర్జన భర్జన-పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు ఆర్టీసీ యూనియన్లు చెబుతున్నాయి. రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నియామక ప్రక్రియ జరుగుతుంది. గతంలో మార్కుల ఆధారంగా ఆయా పోస్టులను భర్తీ చేసేవారు.
అయితే పదో తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి రావడంతో ఎంపిక ఎలా చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతం, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ: ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
ఈ రెండు విధానాలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తోంది ఆర్టీసీ. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ రాసిందట ఆర్టీసీ యాజమాన్యం. దీనిపై బోర్డు నుంచి స్పష్టత తీసుకున్న తర్వాత కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్రావచ్చని తెలుస్తోంది.