Prasanna Death: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతోంది. ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఘటన వెనుక ఏకంగా రూ. 1400 కోట్ల భారీ స్కామ్ లింకులు బయటపడటం సంచలనంగా మారింది. ప్రమాదంలో మరణించిన ఏపీ యువతి ప్రసన్న మృతి వెనుక అసలు నిజాలు ఏంటి? ఆమెకు ఆ స్కామ్తో ఉన్న సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అసలేం జరిగిందంటే?
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. కూతురు మరణవార్తతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, ఈ విషాద ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె మరణంపై పలు అనుమానాలు రేకెత్తించేలా ఒక పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
రూ. 1400 కోట్ల స్కామ్ లింక్!
పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రసన్న మృతికి, గుజరాత్లో వెలుగుచూసిన ఒక భారీ ఆర్థిక మోసానికి లింక్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘షేక్ బజార్ కిసాన్ పరివార్’ అనే పేరుతో భూపాల్ నాయక్ అనే వ్యక్తి, మరికొందరు కలిసి అమాయక ప్రజల నుండి భారీగా డిపాజిట్లు సేకరించి, సుమారు రూ. 1,400 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడైన భూపాల్ నాయక్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read: కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!
డైరెక్టర్గా సంతకాలు.. హత్యేనా?
ఈ కంపెనీకి సంబంధించిన కీలక ఒప్పంద పత్రాలను పరిశీలించిన పోలీసులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ డాక్యుమెంట్లలో ప్రసన్న డైరెక్టర్గా సంతకాలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే ఉందా, లేక మోసంలో భాగస్వామ్యమా, లేదా ఎవరైనా ఆమెను బలవంతంగా ఇరికించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ. 1400 కోట్ల కుంభకోణంలో కీలక సాక్ష్యాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో, ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్దలు ఆమెను పక్కా ప్లాన్తో అంతమొందించారా? అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం గుజరాత్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అమెరికాలో జరిగిన ఆ ప్రమాదం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది.