AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం కేవలం ప్రస్తుత సంక్షేమానికే పరిమితం కాకుండా, రాబోయే దశాబ్దాల సుస్థిర ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అటు పెట్టుబడులు, ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వం గట్టి వ్యూహాన్ని సిద్ధం చేసింది.
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం
సోషల్ మీడియా కొందరి చేతుల్లో వ్యక్తిత్వ హననానికి, అసత్య ప్రచారాలకు వేదికగా మారిందని క్యాబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా మహిళలు, బాలికలను కించపరిచే పోస్టులను సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. దీని నియంత్రణకు విదేశీ చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు, రాష్ట్రంలో సరికొత్త వ్యవస్థలను తెస్తున్నారు. అందుకోసం రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, ప్రత్యేక టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేయనున్నారు. నేరగాళ్లను పట్టుకోవడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ వాడటంతో పాటు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read: పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
భారీ పెట్టుబడులు – వేల ఉద్యోగాలు
రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా రూ.11,569.91 కోట్ల విలువైన 13 పెట్టుబడి ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏకంగా 31,431 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరులో మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ పెట్టే రూ.1,801 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఏపీని దేశంలోనే నంబర్-1గా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వేస్ట్ ఆయిల్తో నడిచే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్టును కూడా ప్రోత్సహిస్తున్నారు.
వినోదం, పర్యాటక రంగాలకు సరికొత్త ఊపు
రాష్ట్రాన్ని అంతర్జాతీయ టూరిజం హబ్గా మార్చేందుకు వీలుగా పాలసీలో మార్పులు చేశారు. భారీ కన్సర్ట్లు, కార్నివల్స్ నిర్వహణను ప్రోత్సహించడానికి ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) ఇస్తారు. 20 వేల మంది వరకు వచ్చే ఈవెంట్లకు రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ మంది వచ్చే ప్రోగ్రామ్స్కు రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. అవసరమైతే ప్రభుత్వ మైదానాలను ఉచితంగా వాడుకునే వీలు కల్పిస్తున్నారు.
Also Read: కారు, బైక్ కాదు.. ఏకంగా బస్సునే దొంగిలించాడు! చివరికి ఎలా దొరికాడంటే..?
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత కోచింగ్
సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 3 ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తారు. గురుకుల హాస్టళ్లను ఆధునిక వసతులతో కూడిన రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చి, నాణ్యమైన ఫ్యాకల్టీతో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..పలు కీలక అంశాలపై కొనసాగుతున్న చర్చ#APCabinet #ChandrababuNaidu #Amaravati pic.twitter.com/ooq4UbAIiC
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2026