Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఎంతో నిష్టతో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులవుతారు. గోవిందుడి దర్శనం సమయంలో ఎలాంటి అపచారం జరుగకుండా చూసుకుంటారు. ఆ దేవదేవుని దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తుంటారు. అలాంటి తిరుమల వెంకటేశుడి సన్నిధి వద్ద అనేక ఘోర అపచారాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఏదొక అపచారం జరుగుతూనే ఉంది.
తాజాగా బాలాజీ నగర్ సమీపంలోని గరుడ పోలీస్ విశ్రాంతి భవనానికి అతిసమీపంలో.. పెద్ద సంఖ్యలో మందు బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాలాజీ నగర్ సమీపంలోని గరుడ పోలీస్ విశ్రాంతి భవనానికి అతిసమీపంలో పెద్ద సంఖ్యలో మందు బాటిళ్లు కనిపించడం వివాదాస్పదం అయింది. విజిలెన్స్ విభాగం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే పోలీస్ అతిథి గృహంవద్ద మద్యం బాటిళ్లు లభించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ ఖండించారు. ఎవరైనా తాగిపడేశారా లేదంటే ఖాళీసీసాలు తెచ్చిపెట్టారా అన్నకోణంలో విచారిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఇదే అంశంపై టీటీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమేనని ఆరోపించారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ఇలాంటివి వైసీపీకే అలవాటు అని ఆరోపించింది టీడీపీ.
వైసీపీ నాయకుడు నాగరాజు రెడ్డి 2024కు ముందు ఔటర్ రింగ్ రోడ్డులో.. మద్యం తాగుతూ తీసుకున్న ఫోటోలను బయట పెట్టారు. అసలు ఈ మందు బాటిళ్లు ఎప్పటివి?ఇందులో ఏమైనా కుట్ర ఉందా అన్న అంశంపై ఎక్సైజ్ శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తున్నామని చెబుతోంది టీటీడీ.
Also Read: కనిపించని దారి.. ఆగని మంచు.. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ప్రమాదకర పరిస్థితులు
ఇదిలా ఉంటే ఇటీవల తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో.. మందుబాబు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకాంత సేవ ముగిసాక మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆలయం గోడ దూకి.. గుడి లోపలికి ప్రవేశించి, గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు మందుబాబు ప్రయత్నించాడు. అయితే 90ML ఇస్తేకానీ కిందకు దిగనని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు మూడు గంటలు శ్రమించిన తర్వాత నిందితుడిని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.